Sunday 28 October 2018

జ్యోతిష సంబంధ కథలు

జ్యోతిష సంబంధ కథలు
వరాహ మిహిరుడు.
          పూర్వం ఉజ్జయిని రాజైన విక్రమార్కుని ఆస్థానములో వరాహ మిహిరుడు గొప్ప  విద్వాంసుడు.విక్రమాదిత్యుని ఆస్థానములో తొమ్మండుగురు విద్వాంసులు ఉండే వారు.. వారినే నవరత్నములు అని కూడ పిలిచే వారు.ప్రముఖ కవి కాళిదాసు కూడ అందులో ఒకరు.వరాహ మిహిరుడి అసలు పేరు మిహిరుడు.అయితే ఆయనకు వరాహ అనే బిరుదు ఎలా వచ్చిందో తెలిపే కథ ఒకటి ఉంది.
    విక్రమార్క మహారాజు కు ఒక కొడుకు పుట్టిన తరుణం లో రాజు ఆస్థాన జ్యోతిష్కులందరిని పిలిచి జనన కాలమును బట్టి తన కుమారుని జన్మ పత్రిక లిఖించి ఆయుర్దాయం గణింప  వలసినదని కోరెను.ఆస్థాన జ్యోతిష్కులందరు జాతకమును సిద్దపరచిరి.గ్రహ స్థానముల బలాబలములను పరిశీలించి కుమారునకు 18 వ ఏట ఏదో ఒక గండమున్నదని ఊహింపగల్గిరి,కాని దాని స్వభావ మెట్టిదో మరణకారకమగునా కాదా నిశ్చయింప జాలక పోయిరి.కాని గండము గడచి బయట పడ వచ్చునని తెలిపిరి.దీనికి భిన్నముగా మిహిరాచార్యుడు ఆ బాలుడు 18 వ ఏట పలాన మాసమున పలానా దినమున సూర్యోదయానంతరము 27 ఘడియలకు వన వరాహముచే ప్రాణములు కోల్పోవునని జంకు గొంకు లేకుండ నిర్మొహమాటముగా నిర్భయుడై రూఢిగా చెప్పెను.ఆ రాజు జ్యోతిష శాస్త్రము నందు అధిక విశ్వాసము గలవాడైనందున మరియు జ్యోతిష విద్వాంసుల పై గౌరవముతో మిహిరుడు చెప్పిన మాటలపై కినుక వహించక ,తగు ప్రయత్నము చేయుట వలనను,భగవదనుగ్రహం వలనను ఆ అనర్థ తీవ్రతను తగ్గింప వచ్చునేమో నని తలచి మంత్రులతోను,శ్రేయోభిలాశులతో అలోచించి కుమారుని రక్షణార్థం తగు జాగ్రత్తలు తీసుకొనెను.
  తన భవనమునకు మైలు దూరములో 7 అంతస్తుల భవనము నొకటి నిర్మింపజేసి దాని చుట్టును 80 అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి, క్రిమి కీటకములు గూడ లొన ప్రవేశించుటకు వీలు లేనంత కట్టడి చేసి రాకుమారునకు కావల్సిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేసెను.విద్యాభ్యాసమునకు కూడ ఆ భవనములోనే తగు ఏర్పాట్లు చేసెను. జ్యోతిష్కులు పేర్కొన్న గడువు ఇంకను 2 రోజులు ఉన్నదనగా ఆ భవనము చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి బయటి ప్రాణి ఓక్కటి కూడా లోపలికి పోకుండ హెచ్చరికలతో భటులకు ఆఙ్ఞాపించెను.కుమారుని దేహ ఆరోగ్యస్థితి తెలిసికొనుటకై వేగులని ఏర్పాటు చేసెను. నాటి మధ్యాహ్నము 3 జాముల వరకు   వేగులు తడవ తడవకు ఒకరి వెనుక ఒకరు వచ్చి రాకుమారుని క్షేమమను గూర్చి తెలుపుచుండిరి.రాజు గారు నిండు సభలో జాతక పలితములను గూర్చి దైవఙ్ఞులతో చర్చలు జరుపుచుండెను.కొందరు దైవఙ్ఞులు మిహిరాచార్యుని జాతక గణన లో ఏదో తప్పు చేసియుండునని తమలో తాము బాధ పడుచుండిరి.సభాసదులు వారి వారి అభిప్రాయములను రాజు గారికి తెలిపిరి.వారి వారి భిన్నాభిప్రాయములు విని రాజు గారు, దైవ వశమున తన కుమారుని గండము తప్పినను ,ఆచార్యులయెడ తనకు గల భక్తి గౌరవములు సడలవని,శాస్త్రముపై గురుత్వమేమాత్రము నశింపదనియు,మరింత హెచ్చునని గంభీరముగా పలికెను. ఇంతలో సూర్యోదయాది నుండి 26 వ ఘడియ గడిచెను.అప్పుడు ఒక వేగు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపెను.
  తదుపరి అందరు రాకుమారుని చూడ డానికి బయలు దేరిరి.దారిలో 28 వ ఘడియ సమయములో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపెను.అందరు ఆచార్యుని వంక చూసిరి.అతడు ఇంతకు ముందు లాగానే గంభీరముగా నుండెను.అందరు మేడలోకి ప్రవేశించి ప్రతి అంతస్తును  పరికించుచూ అచ్చట ఉన్న వారు కుమారుని క్షేమ సమాచారము చెప్పుచుండగా పైకి వెళ్ళిరి.మధ్యలో కొందరు రాకుమారుడు ఏదో బద్ధకముగా నుండుటచే అరఘడియ ముందు మంచి గాలికై డాబా మీదికి వెళ్ళినాడని తెలిపిరి.గుండెలు దడ దడ కొట్టుకొనుచుండగా అందరును ఏడవ అంతస్తు డాబా పైకి వెళ్ళీ చూడగా అచట ఒక ధ్వజ స్తంభము క్రింద మంచం పై ఇనుప వరాహ విగ్రహము రొమ్ముపై బడి నెత్తురు గారుచున్న కుమారుని చూచిరి. రాజు పుత్ర శోకములో మునిగి ఉండికూడా,మిహిరుని విఙ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడెను.తాను ఎన్ని ఉపాయములు అవలంబించినకూడ శాస్త్ర పలితముమే సంభవించెను.ఆకాలములో వారి కులదైవం వరాహమూర్తి అగు విష్ణువును ఇళ్ళు నిర్మిస్తున్నప్పుడు శిల్పి స్తంభముపై నిలిపెను.దైవ వశమున అది రాకుమారుని మరణమునకు కారణమయ్యెను.
శాస్త్ర విధి తప్పదనుటకు ఇది తార్కాణమని పల్కుచూ రాజు అచార్యుని ఆలింగనము చేసుకొని అదిమొదలు  అతడు “వరాహ మిహిరాచార్యుడు”అని పిలువబడునని “వరాహ” బిరుదు నొసగి శ్లాఘించెను.
       ఈ కథ ఎంత వరకు సత్యము అనునది చారిత్రకాన్వేషకుల బాధ్యత,కాని ఆకాలములో  జ్యోతిష శాస్త్రము యొక్క ఔన్నత్యమును,వికాసమును చాటుతుంది.తరువాతి తరములలో దానికి తగు శ్రద్ధ,శిక్షణ,గ్రంథ లభ్యత ,ఆసక్తి లేనందున జ్యోతిషమ్ వెనుక బడినది.
       వరాహ మిహిరాచార్యుని రచనలు.బృహత సంహిత.(హోరా గ్రంథము),పంచ సిద్ధాంతిక,లఘు జాతకము,వివాహ పటలము,యాత్రా గ్రంథము,సమాస సంహిత,జాతకార్ణవము,ఢికినిక యాత్ర,గ్రహణ మండల ఫలమ్,పంచ పక్షి,మొదల్గునవి.

2.లీలావతి గణితం నకు సంబంధించిన చిన్న కథ.
    మనం చిన్నప్పుడు లీలావతి గణితం అనే పదం మన తరగతి పుస్తకాలలో చదివి ఉంటాము.అయితే లీలా వతి వ్రాయలేదు ఆ గణితాన్ని.
లీలావతి అనే ఆమే భాస్కరాచార్యుడి కుమార్తె.భాస్కరాచార్యుడు “సిద్ధాంత శిరోమణి” అనే సిధ్ధాంత గ్రంథాన్ని, “కరణ కుతూహలం అనే కరణ గ్రంథాన్ని వ్రాసినాడు.    సిధ్ధాంత శిరోమణి అనేది చాలా పెద్దది.నాలుగు భాగాలు అవి.1.పాటీ గణితంలేదా లీలావతి గణితం 2.బీజ గణితం 3.గ్రహ గణితము 4.గోళాధ్యాయం
లీలావతి గ్రంథం లో అంక గణితము,క్షేత్ర గణితము గురించి తెలిపినాడు.తన కుమార్తె లీలావతి శ్రేయస్సుకై భాస్కరుడు ఈ గ్రంథాన్ని వ్రాసాడని ఒక గాథ కలదు.
      ఆమె జాతకం ప్రకారం అవివాహితగా ఉండి పోవాలి.భాస్కరుడు మాత్రం ఆమెకు పెళ్ళి జర్పించాలని తన జ్యోతిష విఙ్ఞానమ్  అంతా వినియోగించి మంచి ముహూర్తానికై ఆలోచించసాగాడు.ఆమె వివాహాన్ని గట్టి శుభ ఘడియలో జరిపించాలనుకొని ముహూర్త శుభ ఘడియలను నిశ్చయించుకొని ఆ కాలాన్ని సూచించే నీటి గడియారాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు.కాని అతని సత్సంకల్పాన్ని విధి బాల వధువు రూపంలో భగ్నం చేసింది.బాల్యోత్సాహం తో కేరింతలు కొడుతూ ఆ నీటి గడియారం దగ్గరకు వెళ్ళి తొంగి చూసింది.ఆ హడావుడిలో ఆమె నగలనుండి ఒక చిన్న ముత్యం జారిపడి నీటి గడియారంలో పడి,నీరు ప్రవహించే రంధ్రానికి అడ్డుపడింది.ఆ  శుభ ఘడియ దాటిపోయింది.ఆ పిల్ల అవివాహితగానే మిగిలిపోవలసి వచ్చింది. ఆమెకు ఊరట కల్పించే సంకల్పం తో ఆమె పేరు చిరస్మరణీయం కావాలనే తలంపుతో భాస్కరుడు తాను వ్రాసిన అంక గణిత,క్షేత్ర గణిత గ్రంథానికి లీలావతి గణితం అని పేరు పెట్టాడు.
లీలావతి గణితం లో మొదటి అధ్యాయం అంక గణితం .ఇందులో 278 శ్లోకాలు ఉన్నవి.దీనిలో సంఖ్యలు దశాంశ పద్దతిలో పరార్ధం వరకు అంటే 10^17(ten to the power of 17) వరకు చెప్పబడ్డాయి.
  మామూలు కూడికలు,తీసివేతలు ,గుణకార,భాగాహారాలతో పాటు,వర్గం(sqare),వర్గమూలము(sqare root),ఘనము(cube) ,ఘనమూలము(cube root),త్రైరాశికమ్(rule of three),పంచ రాశికము(rule of five),సప్త రాశికమ్(rule of seven),నవరాశికం(rule of nine),శ్రేణి(series),చితి(piles),రాశి(heap),చాయ(shadow),కుట్టకము(pulveriser),అంక పాశము,ప్రస్తారాలు,సంయోగాలు(permutations-combinations) గురించి శ్లోక రూపం లో వివరించ బడ్దాయి.
  అంక పాశమునకు ఒక చక్కటిఉదాహరణ.263 వ శ్లోకం
 శ్లో॥పాశాంకుశాహి డమరూక కపాల శూలైః।
        ఖట్వాంగ శక్తి శర చాపయుతైర్భవంతి॥
        అన్యోన్య హస్త కలితైః కతి మూర్తి భేదాః
       శంభోర్హరే రివ గదాది సరోజ శంఖైః॥
   అనగా మహేశ్వరుని పది చేతులలో  పది ఆయుధాలు ఉన్నవి అవి .1.పాశము .2.అంకుశం 3.సర్పం 4.డమరు 5.కపాలమ్ 6.శూలమ్ 7.మంచంకోడు.
     8.శక్తి  9 బాణము 10.ధనుస్సు. ఈ పది ఆయుధాలను పది పది చేతులలో మార్చి ,మార్చి ఉంచగా మహేశ్వరుని రూపాలు ఎన్ని అవుతాయి?
     అలాగే విష్ణువు నాలుగు చెతులలో గల గద,శంఖం,చక్రం,పద్మం అనే నాలుగింటిని మార్చి మార్చి ఉంచగా శ్రీ మహా విష్ణువు రూపాలు ఎన్ని అవుతాయి ?
పై రెండు ప్రశ్నలకు సమాధానాలు తార్కింకంగా ఆలోచించి చెప్పండి.లేదా వివరణాత్మకంగా చెప్పండి

1.      మహేశ్వరుని రూపాలు 36,28,800
2.      విష్ణువు రూపాలు…………24.
ఎలాగో చూద్దాం.
     ఉదాహరణకు …………ఒక అంకె తో ఎన్ని సంఖ్యలు ఏర్పడుతాయి?
                                  ఒకటి మాత్రమె
     రెండు అంకెలతో ఎన్ని సంఖ్యలు ఏర్పడుతాయి.?
             రెండు అంకెలు……5,6 అనుకుందాము.
               అప్పుడు 56, 65 రెండు అంకెలు ఏర్పడ్డాయి
            3 అంకెలతో ఎన్ని ఏర్పడుతాయి?
          5,6,7, అనుకుందాము
                      567, 576
                      657,675
                     756,765     మొత్తము 6 సంఖ్యలు ఏర్పడుతాయి
        4 అంకెలతో ఎన్ని?
       అంకెలు  5,6,7,8, అనుకుందాము,
        5తో మొదలగునవి   6 సంఖ్యలు… ………………..5678,5687;,5768,5786;,5876,5867,
        6 తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు….       6578, 6587; ,6758,6785;,6857,6875,
       7  తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు    …….7568,7586; 7856,7865; 7658,7685;
        8  తో మొదలగునవి ఇలాగె 6 సంఖ్యలు………8567,8576; 8657,8675; 8756,8765
మొత్తమ్ 6+6+6+6=24  ఇలా విష్ణువు రూపాలు 24.
    Mathemetics ప్రకారం   ఒక అంకె తో =1x1=1
                                      రెండు అంకెలతో=2X1=2
                         మూడు అంకెలతో   3x2x1=    6
                     నాలుగు అంకెలతో 4x3x2x1=24
ఈ సూత్రం(F0rmula) తోనే  శంకరుని రూపాలు= పది చేతులలో పది ఆయుధాలు మార్చి మార్చి ఉంచగా   శంకరుని రూపాలు
      10x9x8x7x6x5x4x3x2x1=36,28,800


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home